– హామీలు నెరవేర్చలేక డైవర్షన్ రాజకీయాలు
– బొగ్గు, అమృత్ స్కాములపై విచారణ ఎందుకు లేదని ప్రశ్న
– కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ?
– సిట్ విచారణ రాజకీయ వేధింపులేనని ఆరోపణ
– సిరిసిల్లా పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనేది దర్యాప్తు కాదని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు రూపొందించిన డెయిలీ సీరియల్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో అసమర్థత, హామీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిట్ల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణలో ఏ అంశమూ లేదని, ఇదంతా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల సమయంలో టైం పాస్ కోసం చేస్తున్న రాజకీయ నాటకమని కేటీఆర్ ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా, హామీల వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే ఈ కేసులు, నోటీసుల డ్రామా కొనసాగుతోందని విమర్శించారు.
అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇవ్వాల్సిన లబ్ధులు ఇవ్వకుండా, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఫార్ములా–ఈ అంటూ రోజుకో అంశంపై డ్రామాలు సృష్టిస్తూ రాజకీయ అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడుతోందన్నారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం సాధించింది ఏమీలేదని వ్యాఖ్యానించారు.
సింగరేణిలో బొగ్గు కుంభకోణంపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తితే, అదే రోజు సిట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టిందన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణాల్లో నేరుగా పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తూ, అమృత్ పథకంలో అర్హత లేకున్నా కాంట్రాక్టులు దక్కించుకున్న విషయాన్ని తానే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్ట్ ఎంపవర్డ్ కమిటీ రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పినా, దానిపై ఎందుకు సిట్ వేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాజకీయ నాయకులను కాకుండా, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు, డీజీపీలు, హోం సెక్రటరీలను విచారించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. నిఘా వ్యవస్థ శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించినదని, దానికి మంత్రులు, రాజకీయ నాయకులకు సంబంధం ఉండదన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదని ఒక్క అధికారి అయినా అధికారికంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.
