ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న నివాసంలో రెండవ అంతస్తులోని ఓ గదిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవ్వగా.. నాలుగు గంటల 50 నిమిషాలపాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావును సిట్ ప్రశ్నించింది. వీరిలో ఏడుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారంతోనే కేసీఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారులు, పార్టీ నేతలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక ఉన్నది ఎవరు? ప్రభాకర్ రావు నియామకం విషయంలో మీ పాత్ర ఏంటి అనే అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ‘పెద్దాయన’ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని పలువురు అధికారులు విచారణలో చెప్పడంతో ఆ పెద్దాయన మీరేనా? మీ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ లో మీ ప్రమేయం ఏంటి అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి వినియోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరి ఆదేశాల మేరకు ఇవి పనిచేశాయి..? అన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది. విచారణ ఎదుర్కొన్న అధికారులు.. పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ కుట్ర కోణం వెనుక ఉన్న ఆ పెద్దాయన మీరేనా? అని సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేసుకున్నారు. మాధాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్ కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు కేసీఆర్ ను ప్రశ్నించారు. ఆయన చెప్పిన విషయాలన్నింటినీ సిట్ అధికారులు రికార్డు చేసుకున్నారు. విచారణ మొదలుకాకముందే సిట్ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో కేసీఆర్ గదిని పూర్తిగా తనిఖీ చేశారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేశారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే ఇంట్లోకి అనుమతించారు. అయితే.. విచారణ జరుగుతున్న గదిలోకి ఎవరినీ.. కనీసం లాయర్ను కూడా అనుమతించలేదు. ఎర్రవల్లి నుంచి వస్తున్న సమయంలో భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని.. కేవలం కేసీఆర్ వాహనాలను మాత్రమే అనుమతించారు. విచారణ కొనసాగుతుండగా.. ఆయన నివాసంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ మద్దతుదారుల వైపు చేయి ఊపుతూ లోపలికి వెళ్లారు. తదుపరి సిట్ అధికారులు ఈ వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. కాగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి వచ్చిన కేసీఆర్ తన వెంట ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్లు తెచ్చుకున్నారు. సిట్ అడిగే ప్రశ్నలను ఆయన నోట్ చేసుకున్నారు. ఇక తన వెంట తెచ్చిన డాక్యుమెంట్లలో ఏముందనేది ఎవరికీ తెలియరాలేదు. విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చిన కేసీఆర్ కు కేటీఆర్ స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. విచారణకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు బిల్డింగ్ లోని రెండో అంతస్తులో ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం కల్పించారు. దీంతో గులాబీ బాస్ వెంట మాజీ ఎంపీ సంతోశ్ రావు ఉంటారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సిట్ కు సమాచారం అందజేసింది. ఇక విచారణ సమయంలో కుటుంబ సభ్యులెగా కేటీఆర్, హరీశ్ రావు ఇంట్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అందరూ తెలంగాణ భవన్ లోనే ఉన్నారు.
నందినగర్లోని ఆయన నివాసంలోని రెండో అంతస్తులో ఉన్న ప్రత్యేక గదిలో సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఈ క్రమంలో విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర సాధన కోసం గత పదేళ్లుగా ఏ గదిలో వ్యూహాలు రచించానో.. ఏ గదిలో నిద్రలేని రాత్రులు గడిపి ఉద్యమానికి దిశానిర్దేశం చేశానో.. అదే గదిలో ఇప్పుడు నిందితుడిలా విచారణ ఎదుర్కోవడం బాధాకరమని ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘రాష్ట్రం కోసం పోరాడిన చోటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు’ అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
అట్టుడికిన నగరం…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరసనలకు దిగారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి సీఎం రేవంత్ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణానైనా సీఎం నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం ఇంటికి వెళ్లే మూడు దారుల్లోనూ పోలీసులు అడుగడుగునా భద్రతా కట్టదిట్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ధర్నాకు దిగారు. ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అరెస్ట్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకుల్ని అడ్డుకున్నారు. మరోవైపు కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఐదుగురు డీసీపీలు బందోబస్త్ నిర్వహించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బొమ్మకు అంటుకున్న మంటలను ఆర్పారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సచివాలయం పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
