బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట బీజేపీ నేతల ఫోన్లనే ట్యాప్ చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు ఫోన్లను ట్యాప్ చేసినట్లు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు.. అసలు మా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీరియస్ అయ్యారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.మా ఫోన్లు ట్యాప్ చేసి.. ఉల్టా మాపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… ఎవరు తప్పు చేసినా జైలుకు పంపుతామని గతంలో కేసీఆర్ అన్నారు.. ఆ మాటలు కేసీఆర్కూ వర్తిస్తాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై జాలి చూపొద్దని.. దోషులను తప్పకుండా జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శించే మూర్ఖులంతా అంధులేనని ఎంపీ రఘునందన్ విమర్శించారు. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సున్నా అని ఒక్కొకరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకే కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఒక తీరుగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. బడ్జెట్పై ఒక దిక్కు కేటీఆర్.. ఇంకో దిక్కు హరీశ్రావు, కవిత మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి ఏడు హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్కు మూడు హైస్పీడ్ రైళ్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ విషయం.. బావబామ్మర్దులకు కనిపించడం లేదా?, అని ప్రశ్నించారు. గత బడ్జెట్ కంటే రైల్వే రంగానికి ఈసారి 15 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయించామన్నారు ఈ బడ్జెట్లో తెలంగాణకు సున్నా అని చెబుతున్నరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓసారి బడ్జెట్ను పరిశీలించాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రూ.1300 కోట్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేటాయించారని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
