సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో బుధవారం నుంచి వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సమగ్ర తెలంగాణకు బ్లూ ప్రింట్ సిద్ధం : కవితరాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేసే బ్లూ ప్రింట్ రూపొందించే ఉద్దేశంతో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మొత్తం యాభై అధ్యయన కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించి ఆయా రంగాలపై లోతైన అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికే పలు కమిటీలు తమ నివేదికలను సమర్పించగా, మిగిలిన కమిటీలు త్వరలోనే నివేదికలు అందజేయనున్నాయి.
వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, మహిళా సాధికారత, యువత, నిరుద్యోగ సమస్యలు, గిరిజన సంక్షేమం, దళితుల అభివృద్ధి, పట్టణ–గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాలపై ఈ కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదికలు రూపొందిస్తున్నాయి. ఆయా రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు కమిటీలలో భాగస్వాములుగా ఉన్నారు.
ప్రతి కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు వివిధ వర్గాల ప్రజల సాధికారతకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని భవిష్యత్ తెలంగాణకు మార్గదర్శకంగా ఉండే రూట్ మ్యాప్ రూపొందించడమే ఈ అధ్యయన కమిటీల ప్రధాన ఉద్దేశమని జాగృతి వర్గాలు వెల్లడించాయి.
