– ఉపాధి పనికి గాంధీ పేరును ఎందుకు తొలగించారో చెప్పాలి
– ఆదానీ మైనింగ్ కోసమే ఆపరేషన్ కగార్
– నరేంద్రమోదీ మైండ్ సెట్ మారితే తప్ప దేశం బాగుపడదు
– అదానీ, అంబానీల మీదనే బీజేపీకి ప్రేమలు
– సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
దేవుడు గుడిలో ఉండాలి… మహాత్ములు మనుషుల్లో ఉండాలని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరును తొలాగించాల్సిన అవసరం ఏమోచ్చిందని బిజేపీ నేతలను ప్రశ్నించారు. రాముడు పేరు స్ఫురించేలా – వీబీజీ-రాంజీగా ఎందుకు మార్చారని, రాముడిని ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదానీ మైనింగ్ కు అడ్దుగా ఉన్నారనే కారణంగానే మావోయిస్టులు, గిరిజనులను తొలగించేందుకే ” ఆపరేషన్ కగార్ ” వచ్చిందని స్పష్టం చేశారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఆరావళి పర్వతాలను సైతం నాశనం చేసేందుకు రంగం సిద్ధమయిందన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భారత రాజ్యాంగం, రాజ్యాంగంలోని సెక్యూలర్, సోషలిజం వంటి వాటిపై కూడా బీజేపీకి ప్రేమ లేదని ఆయన విమర్శించారు. హిందూ, ముస్లీం కలిసి బతకాలని కోరినందుకు గాంధీని హత్య చేశారని, అలాంటి ఆర్ఎస్ఎస్ ను పటేల్ నిషేధించారని గుర్తు చేశారు. అదే పటేల్ ను ఎత్తుకున్న బీజేపీ పటేల్ స్టేడియం పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టుకున్నారని విమర్శలు చేశారు. గతంలో రైతు వ్యతిరేకంగా తెచ్చిన మూడు నల్లచట్టాలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఆ సమయంలో మోడీ జాతికి ఆన్ – రికార్డ్ క్షమాపణ చెప్పారని తెలిపారు. మోదీజీ మైండ్ సెట్ మారితే తప్పా దేశం బాగుపడదని వాపోయారు. అంబానీ, ఆదానీల మీద ప్రేమ తగ్గించుకోవాలని బీజేపీకి ఆయన హితవు పలికారు.
