ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుచేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ప్రజాస్వామ్య అసెంబ్లీలో ఇలాంటి మాటలకు ఎలాంటి స్థానం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బండి సంజయ్…దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయిందని విమర్శించారు. ఇలాంటి బాధ్యతలేని, అభ్యంతరకరమైన భాషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకూ, ప్రధాని మోదీకీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
