– కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలి
– మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి
– పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన కేటీఆర్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు చేసిన ద్రోహం, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన తీరును ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం ఖాయమని చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల వ్యూహంలో సమన్వయం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విజ్ఞప్తిని మన్నించి నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను గౌరవంగా ఆహ్వానించి, ప్రచారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన నాయకులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉందన్నారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. చివరి ఘట్టమైన ప్రచారంపై పూర్తి దృష్టి సారించి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలో విజయావకాశాలున్న మున్సిపాలిటీలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మున్సిపల్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
