– అభివృద్ధి చెప్పకుండా హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
– కాంగ్రెస్–బీఆర్ఎస్లపై తెలంగాణ జాగృతి తీవ్ర విమర్శలు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించిన విధంగానే ఎలాంటి సన్నద్ధత లేకుండా మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారని జాగృతి నేతలు ఆరోపించారు. మున్సిపాలిటీల పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోళ్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలనలో నెలకొన్న సమస్యలు, ఎన్నికల రాజకీయాలపై విస్తృతంగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల పరిధిలో అసలు ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పాలని కోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీల్లోకి, మున్సిపాలిటీలను కార్పొరేషన్లలోకి కలపడం తప్ప పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క వర్షం పడితేనే నగరం ఆగమయ్యే పరిస్థితి ఉందని, ఇది పాలకుల వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాగునీరు, మోరి నీటితో కలుషితమవుతుండటం, పారిశుద్ధ్య నిర్వహణ క్షీణించడం, పార్కుల స్థలాలు–చెరువుల కబ్జాలు వంటి సమస్యలు మున్సిపాలిటీల్లో తిష్ట వేసాయని నవీన్ ఆచారి అన్నారు. ఈ అంశాలపై యువత ప్రశ్నిస్తే “ఎక్కడైనా చెప్పుకోండి” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర సుందరీకరణ ఏమైందన్న దానిపై కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి స్పష్టమైన సమాధానం లేదని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, బీఆర్ఎస్ నేతలు జనాన్ని పోగు చేసి హంగామా చేయడం తప్ప ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలపై చర్చించడంలేదని జాగృతి నేతలు ఆరోపించారు. మున్సిపాలిటీల్లో ఏం చేశాం, రేపు ఏం చేస్తామన్న దానిపై చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రెండు పార్టీలూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల కోసం పనిచేసే నాయకురాలు కవిత త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని కోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆమె రాజకీయ పార్టీ కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. జనంబాట సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలను కవిత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, వాటిలో ఎన్ని పరిష్కరించారో పాలకులు చెప్పాలని సవాల్ విసిరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని నేతలు ప్రకటించారు. జాగృతి అభ్యర్థులు సింహం గుర్తుపై బరిలో ఉన్నారని, ప్రజల సమస్యల కోసం నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నిలదీయాలని జాగృతి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని అడగాలని సూచించారు.
ప్రజల సమస్యలను పక్కనపెట్టి డైవర్షన్ రాజకీయాలు చేసే పార్టీలను ఈ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారని హెచ్చరించారు.
