– జీహెచ్ఎంసీ కొత్త విధానానికి లేచిన తెర
– ఐదేండ్లుగా సాగుతున్న గూడుపుఠాణీ వ్యవహారం
– తప్పుడు పత్రాలు సమర్పించినా టెండర్ల కేటాయింపు
– టెండర్లలో ఒక ఖాతా, బిల్లుల చెల్లింపులు మరో ఖాతాలోకి..
– ఇంజనీరింగ్, ఆడిటింగ్, లీగల్ సెక్షన్లు సైతం ఏజెన్సీకే మద్దతు
– వరుస ఫిర్యాదులు అందుతున్నా బుట్టదాఖాలయ్యాయని ఆరోపనలు
– గతంలోనూ సదరు ఏజెన్సీపై అనేక ఫిర్యాదులు, కేసులు నమోదు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
వడ్డించే వాడు మనోళ్లయితే… ఏ బంతిలో కూర్చొన్న నష్టమే లేదని సామెత. జీహెచ్ఎంసీ అధికారులు సరిగ్గా ఈ మాటను నిజం చేస్తున్నారు. ఏజెన్సీపై ఎన్ని ఫిర్యాదులు ఉన్నా, కేసులు నమోదైనా, సేవల్లో ఎంత దరిద్రంగా ఉన్నా సరే.. తమది తమకు ముట్టచెబితే కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తున్నారు. చివరకు సరైన ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేకపోయినా, టెండర్లలో ఇచ్చిన పత్రాలకు, టెండర్ తర్వాత ఇచ్చే పత్రాలకు పోలిక లేకపోయినా బిల్లులు చెల్లించేస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఎన్ని అక్రమాలు చేసినా, ఔట్ సోర్సింగ్ వేతనాల్లో కోతలు వేసినా ‘ఇట్స్ ఓకే’ అనేస్తున్నారు. కోతల్లో మాత్రం తమకు వాటా అందితే సరి. ఈ అనైతిక అధికారుల బంధం నాలుగేండ్లుగా కొనసాగుతుందంటే ఆశ్చర్యం వేయకమానదు. కాని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ దందాకు మచ్చుతునక మాత్రమే..
2021-22 ఏడాదిలో ఎల్బీ నగర్, ఖైరతాబాద్ జోన్లలో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఎంటమాలజీ విభాగం పనుల కోసం వేసిన ఈ టెండర్లను ‘దుర్గాభవానీ ఎంటర్ ప్రైజెస్’ ఏజెన్సీ సొంతం చేసుకున్న అధికారులు పనులు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత అనేక సాకులు చూపుతూ… ఈ వర్క్ ఆర్డర్స్ ను 2025 వరకు విజయవంతంగా సదరు ఏజెన్సీ ఎక్స్ టెన్షన్ చేసుకోగలిగింది. చివరకు టెండర్ నిబంధనలకు విరుద్దంగా కారణాలతో కోర్టులను ఆశ్రయించి గతంలో పనిచేసిన కమిషనర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇందులో ఏజెన్సీలకు ఆయా విభాగాల సహకారం మెండుగా ఉన్నాయనే చర్చలు అప్పట్లో సాగాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు టెండర్లు కేటాయించిన అధికారులు ఏజెన్సీకి సంబంధించిన ఫర్మ్ రిజిస్ట్రేషన్, కంపెనీ పాన్ నెంబర్, కంపెనీ ఖాతా, ఫర్మ్ కేటగిరీ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ టెండర్లు వేసే సమయంలో కంపెనీ పాన్ కార్డు సమర్పించినా ఏజెన్సీ, బిల్లుల చెల్లింపుల సమయంలో మాత్రం వ్యక్తిఖాతా పాన్ నెంబర్ను సమర్పించింది. అయినా సరే.. అధికారులు బిల్లులు విడుదల చేయడం విశేషం. వ్యక్తిగత, కంపెనీ పాన్ నెంబర్ల మధ్య తేడా గుర్తించలేకుండా బల్దియా వ్యవస్థ పనిచేస్తుందా అనే ప్రశ్నలు తెలెత్తక మానవు. దుర్గాభవానీ ఏజెన్సీపై అనేక ఫిర్యాదులు అందుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీలో సుమారు 20 ఏండ్లుగా అధికారులతో పెనవేసుకొన్న బంధంతో ఇంకా కొనసాగుతుండటం బహిరంగ రహస్యం.
జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ జోన్లలో, ఇతర విభాగాల్లోనూ అధికారులతో సదరు ఏజెన్సీ ములాఖత్ అయ్యి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నాయన్న ఆరోపనలు ఉన్నాయి. ప్రస్తుత వివాదంలో టెండర్ల కేటాయింపు నుంచి, బిల్లుల చెల్లింపులు, ఆడిటింగ్ విభాగం కూడా ఏజెన్సీకి మద్దతుగా నిలిచింది. ఏజెన్సీపై అందుతున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో గతేడాది జీహెచ్ఎంసీ కమిషనర్ లీగల్ ఒపెనీయన్ కోరగా… అది కూడా తప్పుడు లీగల్ ధృవీకరణ పత్రం సమర్పించినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ విభాగాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఏజెన్సీలు పాతుకుపోయాయనే విషయాన్ని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో అధికారుల చెట్టాపట్టాల్, ఫ్యామిలీటూర్లు, స్పాన్సర్డ్ ఈవెంట్స్ వంటి అంశాలు కోకొల్లలు. ప్రస్తుత ఏజెన్సీ నిర్వాకాలకు మద్దతుగా నిలుస్తున్న అధికారుల విశేషాలు తవ్వుతున్న కొద్దీ బయటకొస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ అంశంపై దృష్టి సారించి అధికారులు- కాంట్రాక్టర్ల అనైతిక దోస్తీలకు స్వస్తి పలకాలని చిరుద్యోగుల చిరకాలక కోరిక.
