ఎవరైనా పార్టీ నిబంధనలు అతిక్రమించి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్గా బరిలోకి దిగితే కనికరం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుహెచ్చరించారు. నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని సూచించారు. పార్టీ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులకు అందరూ సహకరించాల్సిందే అని తేల్చి చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు, అనుబంధ సంఘాలన్నీ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అత్యధిక పుర పీఠాలపై కాషాయ జెండా ఎగురవేసి.. ప్రధానమంత్రి నరేంద్రమోడికి బహుమతిగా ఇద్దామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనీ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పాలన మనం చూద్దామన్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కాంగ్రెస్ పాలనను అరాచక, అవినీతి పాలన అని అభివర్ణించారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నేటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సంపూర్తిగా అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని.. తద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో టాక్సీల పేరిట భారీ కుంభకోణం జరుగుతోందని రాంచందర్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు రూ. 250 కోట్లకుపైగా కుంభకోణం జరిగిందని వివరించారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధుల్లో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా మారాయన్న ఆయన పార్టీ అధ్యక్షుడు నిత్యం రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. తెలంగాణ డ్రగ్స్కు కేరాఫ్ గా మారిందని ఆరోపించారు.
