– కోర్టు తీర్పుకంటే ముందే ‘ఇల్లీగల్’ ముద్ర..!
– సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై పక్షపాత ఆరోపణలు
– ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని హరీష్ రావు ఫైర్
– పోలీసుల పని తీర్పులివ్వడం కాదంటూ చురక
– ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు తుది తీర్పు రాకముందే, సిట్ చీఫ్ సజ్జనార్ అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం బాధ్యతారాహిత్యమే కాదు, స్పష్టమైన పక్షపాత ధోరణికి నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరం నిర్ధారణ చేసే అధికారం కోర్టులకే ఉంటుందని, పోలీసుల పని కేవలం దర్యాప్తు వరకు మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అంటూ సిట్ చీఫ్ చేసిన ప్రకటన… తీర్పు ముందే దోషాన్ని ఖరారు చేసినట్టుగా ఉందని విమర్శించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరినీ నేరస్థుడిగా పరిగణించరాదన్నది ప్రాథమిక న్యాయ సూత్రమని, అలాంటి మౌలిక హక్కును విస్మరించి, పోలీసు అధికారి స్థాయి వ్యక్తి ఈ తరహా ప్రకటనలు చేయడం శోచనీయమని హరీష్ రావు అన్నారు. దర్యాప్తు దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమని తేల్చడం… పోలీసు వ్యవస్థ హద్దులు దాటినట్టేనా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2),
ఐటీ చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఈ నిబంధనల ప్రకారం ప్రక్రియ జరిగిందా లేదా అన్నది కోర్టు విచారణ ద్వారానే తేలాలి తప్ప, పోలీసుల ట్విట్టర్ ప్రకటనల ద్వారా కాదని హరీష్ రావు స్పష్టం చేశారు.
ట్వీట్లోనే ముందస్తు నిర్ణయం?
సిట్ చీఫ్ విడుదల చేసిన అధికారిక ట్విట్టర్ ప్రకటనలో ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అనే పదాన్ని వాడటమే… దర్యాప్తు ఫలితంపై ముందే ఒక నిర్ణయానికి వచ్చారన్న భావన కలిగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సీనియర్ అధికారుల నుంచి ఆశించే నిష్పాక్షికతకు పూర్తి విరుద్ధమని, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్–1968కు కూడా విరుద్ధమని హరీష్ రావు గుర్తు చేశారు.
ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వలేకపోయారా?
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం… సిట్ చీఫ్ తన అధికారిక ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను కనీసం “గౌరవ ప్రతిపక్ష నేత”గా కూడా సంబోధించకపోవడం. ఇది వ్యక్తిగత అహంకారమా? లేక రాజకీయ ఆజెండాలో భాగమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక మాజీ ముఖ్యమంత్రికి, రాజ్యాంగబద్ధమైన ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకపోవడం ద్వారా… పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనైందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండటమే కాదు, అలా కనిపించాలని కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. విచారణ మొదలవకముందే దోషులు ఎవరో నిర్ణయిస్తే… కోర్టులు, చట్టాలు ఎందుకు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
