– రెబల్స్ బెడద తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్
– గెలిచే అభ్యర్థులకే పార్టీ బీ- ఫార్మ్ ఇవ్వాలని ఆదేశాలు
– మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూడాలని నిర్దేశం
– పార్లమెంట్ ఇంఛార్జ్ మంత్రులు బుజ్జగింపుల్లో బిజీబిజీ
– నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు
– రేపటి నుంచి సీఎం జిల్లా పర్యటనలకు షెడ్యూల్
– మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి మార్గనిర్ధేశం
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రూరల్తో పోలిస్తే బీఆర్ఎస్కు అర్భన్ ఏరియాలో పట్టు ఎక్కువే. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేయడం, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, నిధుల కేటాయింపు అంశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా అదే నిరూపిస్తాయనే అంచనాలో బీఆర్ఎస్ ఉంది. గ్రామాల్లో సైతం బీఆర్ఎస్కు చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా గ్రామాల్లో పట్టుకోల్పోయిన కాంగ్రెస్, రెబల్స్ అభ్యర్థులు.. వెరసి కాంగ్రెస్ రెండేండ్ల పాలన తర్వాత కూడా బీఆర్ఎస్ సర్పంచులుగా గెలిచిన సంఖ్య ఆ పార్టీలో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో కలిగిన ఆందోళన నేపథ్యంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసి.. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు జూమ్ మీటింగ్ ద్వారా మార్గనిర్ధేశనం చేశారు. సోమవారం జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఇతర పీఈసీ సభ్యులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థుల సమస్యను ఎదుర్కోవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు రెబల్స్ మాటే లేకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లకు… గెలిచే అభ్యర్ధులకు బి ఫార్మ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులకు టికెట్ లు రాని పక్షంలో అలాంటి వారికి కార్పొరేషన్లలో నామిటేడ్ పోస్టులను ఇద్దామని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ నెల నాలుగో తేదీ నుండి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై చర్చ కొనసాగింది. ఈ నెల మూడో తేదీకి నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో..ఇప్పటికే రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేసి ఉన్న వారిని విత్ డ్రా చేయించాలన్నారు. సమన్వయంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని పీఈసీ సమావేశంలో నిర్ణయించారు. రెబల్స్ ను బజ్జగించే బాధ్యతను పార్లమెంట్ ఇంఛార్జ్ మంత్రులకు అప్పగించారు. పార్టీ నుంచి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు కావడం, ఇద్దరు కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉండటం పార్టీలో అనైక్యతకు నిదర్శనంగా ప్రజలు భావించే అవకాశముందనే అంచనాలు వచ్చాయి. అలాగే, ప్రభుత్వ పాలనపై నమ్మకం గురించి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో పాటు ప్రజల్లో మరింత గందరగోళానికి తెరతీసే పరిస్థితులు ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్లపైనా చర్చ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల గురించి కూడా పీఈసీలో చర్చకు వచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం, అధికారంలో ఉండి పార్టీ తీసుకున్న కార్యక్రమాలు కొంత నెగిటివ్ ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ఆందోళన కార్యక్రమాలు, కోర్టు అంశాలు వంటి వాటిని ప్రత్యర్థి పార్టీలు కౌంటర్ చేశారు. రిజర్వేషన్లు కూడా ఏదో పద్దతిలో వచ్చినా.. కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఇచ్చిన రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాతైనా కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పీఈసీలో నిర్ణయించారు. ఏఐసీసీ, రాహుల్ గాంధీ ద్వారా జాతీయస్థాయి తెలంగాణలో రిజర్వేషన్ల విషయాన్నిప్రచారం చేయించాలని, అందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లాలని పీఈసీ అభిప్రాయపడింది.
