– సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ నేతృత్వంలో క్షేత్రస్థాయి పరిశీలన
– ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, పాదచారుల ప్రమాదాలు నివారణ
– 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల అండర్పాస్ టన్నెల్ ప్రతిపాదనలు
–
గోల్కొండ టైమ్స్, హైదరాబాద్
సైబరాబాద్ ఐటీ కారిడార్లో పాదచారుల భద్రత , ట్రాఫిక్ రద్దీ తగ్గింపు లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఈ సందర్భంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది.
ఈ స్కైవాక్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా టీ హబ్ వరకు విస్తరించనుంది. ఐటీ కంపెనీలు, కార్యాలయాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. స్కైవాక్ నిర్మాణం పూర్తయితే వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగుతాయి, పాదచారులు ప్రమాదాలు లేకుండా రహదారి దాటే అవకాశం కలుగుతుంది. అధికారులు తెలిపారు, ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ సుమారు 30 శాతం తగ్గే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టును ఎస్సీఎస్సీ సహకారంతో, వివిధ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. తొలి దశలో సుమారు 500 మీటర్ల పొడవు గల స్కైవాక్ నిర్మించనున్నారు. అలాగే, టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీ–గేట్ వరకు 400 మీటర్ల పొడవైన అండర్పాస్ టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతిపాదనలను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్ఏ) ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) కు ప్రభుత్వానికి పంపనున్నారు. భవిష్యత్తులో స్కైవాక్ను ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. జీహెచ్ఎంసీ, టీజీఐఐసీ, ఐఏఎల్ఏ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు.
సీపీ వెంట సహకారంగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పవన్, ఎస్సీఎస్సీ సీఈవో నావెద్, రహేజా మైండ్ స్పేస్, సత్వ, దివ్యశ్రీ, ఫీనిక్స్ గ్రూప్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
