మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మోత్కూర్- భువనగిరి రోడ్డులో ఉన్న మణికంఠ బ్యాటరీ, ఎలక్ట్రికల్ వర్క్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. యజమాని ఏనుగు లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుకాణం మూసి ఉండగా లోపలి నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయని గమనించిన స్థానికులు అప్రమత్తమై ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. బ్యాటరీలు కారణంగా మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉండటం వల్ల ఫైర్ సిబ్బంది సుమారు అరగంట శ్రమించి షట్టర్లను ఓపెన్ చేసి, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న బ్యాటరీలు, వైర్లు, రిపేర్లకు సంబంధించిన పరికరాలు పూర్తిగా దగ్ధమై సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు.
