– మూగజీవాల్ని చంపడం అమానవీయం
– ఏబీసీ, స్టెరిలైజేషన్ పద్దతులు అనుసరించాలి
– ప్రభుత్వ మార్గనిర్ధేశకాలు పాటించకుంటే చర్యలు
– రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూగజీవాలను విషం పెట్టి చంపడం వంటి దారుణమైన చర్యలు పూర్తిగా నేరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి హెచ్చరించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు పత్రికా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనలపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ కొనసాగుతున్నట్టు సీతక్క వివరించారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, అయితే ఆ సమస్యకు పరిష్కారం అనేది చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయమైన మార్గాల్లోనే చేయాలి తప్ప అతి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఆమె వివరించారు.ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నామని, బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని సీతక్క సూచించారు. మూకుమ్మడిగా విషం పెట్టి చంపడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని తేల్చిచెప్పారు. వీధి కుక్కల వల్ల సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, మానవీయత, చట్టబద్ధత, శాస్త్రీయతే ప్రభుత్వ విధానమని అందుకు సహకరించాలని స్పష్టంగా ప్రజలను మంత్రి సీతక్క కోరారు.

