– ఉపాధి పనికి గాంధీ పేరును ఎందుకు తొలగించారో చెప్పాలి
– ఆదానీ మైనింగ్ కోసమే ఆపరేషన్ కగార్
– నరేంద్రమోదీ మైండ్ సెట్ మారితే తప్ప దేశం బాగుపడదు
– అదానీ, అంబానీల మీదనే బీజేపీకి ప్రేమలు
– సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
దేవుడు గుడిలో ఉండాలి… మహాత్ములు మనుషుల్లో ఉండాలని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరును తొలాగించాల్సిన అవసరం ఏమోచ్చిందని బిజేపీ నేతలను ప్రశ్నించారు. రాముడు పేరు స్ఫురించేలా – వీబీజీ-రాంజీగా ఎందుకు మార్చారని, రాముడిని ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదానీ మైనింగ్ కు అడ్దుగా ఉన్నారనే కారణంగానే మావోయిస్టులు, గిరిజనులను తొలగించేందుకే ” ఆపరేషన్ కగార్ ” వచ్చిందని స్పష్టం చేశారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఆరావళి పర్వతాలను సైతం నాశనం చేసేందుకు రంగం సిద్ధమయిందన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భారత రాజ్యాంగం, రాజ్యాంగంలోని సెక్యూలర్, సోషలిజం వంటి వాటిపై కూడా బీజేపీకి ప్రేమ లేదని ఆయన విమర్శించారు. హిందూ, ముస్లీం కలిసి బతకాలని కోరినందుకు గాంధీని హత్య చేశారని, అలాంటి ఆర్ఎస్ఎస్ ను పటేల్ నిషేధించారని గుర్తు చేశారు. అదే పటేల్ ను ఎత్తుకున్న బీజేపీ పటేల్ స్టేడియం పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టుకున్నారని విమర్శలు చేశారు. గతంలో రైతు వ్యతిరేకంగా తెచ్చిన మూడు నల్లచట్టాలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఆ సమయంలో మోడీ జాతికి ఆన్ – రికార్డ్ క్షమాపణ చెప్పారని తెలిపారు. మోదీజీ మైండ్ సెట్ మారితే తప్పా దేశం బాగుపడదని వాపోయారు. అంబానీ, ఆదానీల మీద ప్రేమ తగ్గించుకోవాలని బీజేపీకి ఆయన హితవు పలికారు.
కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది
– ప్రధాని మోదీకి కూనంనేని క్షమాపణ చెప్పాలి
– కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుచేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ప్రజాస్వామ్య అసెంబ్లీలో ఇలాంటి మాటలకు ఎలాంటి స్థానం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బండి సంజయ్…దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయిందని విమర్శించారు. ఇలాంటి బాధ్యతలేని, అభ్యంతరకరమైన భాషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకూ, ప్రధాని మోదీకీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
