– సమస్యల పరిష్కారానికి అపాయింట్మెంట్లు అవసరం లేదు
– క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ల్యాప్టాప్లు, శాఖకు నూతన ఆడిటోరియం
– ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
– ఆర్ అండ్ బి డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి
గోల్కొండ టైమ్స్, హైదరాబాద్
రోడ్లు, భవనాల శాఖ (R&B) అధికారులు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజే డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం ఈ శాఖ పనితీరుకు, క్రమశిక్షణకు నిదర్శనమని ఆయన కొనియాడారు. గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రోడ్లు, భవనాల ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి, 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత
“నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని వివరాలతో కూడిన సమగ్ర డైరీని ఆవిష్కరించడం ఇదే మొదటిసారి” అని మంత్రి ప్రశంసించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, తనను కలవడానికి ఎటువంటి ప్రత్యేక అపాయింట్మెంట్లు అవసరం లేదని భరోసానిచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈ (AE) లకు త్వరలోనే ల్యాప్టాప్లు అందజేస్తామని, శాఖ కోసం అన్ని హంగులతో కూడిన అధునాతన ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పదోన్నతులు – పెండింగ్ సమస్యల పరిష్కారం
గతంలో పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ
రాష్ట్ర పురోగతిలో ఆర్ అండ్ బి శాఖ వెన్నెముక వంటిదని మంత్రి పేర్కొన్నారు. సుమారు రూ. 60 వేల కోట్ల వ్యయంతో రహదారులు, ఆసుపత్రులు, కోర్టులు, కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఉన్న సాన్నిహిత్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 2 వేల కోట్ల సీఆర్ఐఎఫ్ నిధులు తీసుకువచ్చామని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసి, పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీ (IRC) ప్రెసిడెంట్గా ఎన్నికైన ఈఎన్సీ మోహన్ నాయక్ను మంత్రి సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మరియు కార్యవర్గాన్ని అభినందించారు. మంత్రి స్వయంగా కార్యాలయానికి వచ్చి తమతో కలిసి భోజనం చేయడంపై ఇంజనీర్లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు పాల్గొన్నారు.
