కేసీఆర్ ఎందుకు రావడం లేదు?
– నిజాలు తేలుద్దాం రండి!
– అసెంబ్లీలో ‘నీళ్లు – నిజాలు’ చర్చ
– ప్రతిపక్ష నేత తీరుపై ప్రశ్నల వర్షం
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమంటూనే, సభకు రాకుండా తప్పించుకుంటున్న బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం అసెంబ్లీలో ‘నీళ్లు – నిజాలు’ అనే అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలకడం కాదు.. సభకు వస్తే ఎవరి సత్తా ఏంటో, ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలే నిర్ణయిస్తారని సవాల్ విసిరారు.
అడిగింది మీరే.. పారిపోతోంది మీరే!
“అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కృష్ణా జలాలపై చర్చించాలని బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ స్వయంగా కోరారు. అందుకే మేము సభను ఏర్పాటు చేశాం. తీరా చర్చ మొదలయ్యాక కుంటిసాకులు చెబుతూ పారిపోవడం ఏంటి?” అని సీఎం ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడే అవకాశం ఇచ్చినా, సభను బహిష్కరించి వెళ్లడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
అనుభవాలు పంచుకుంటారనుకుంటే..
గత రెండేళ్లుగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని రేవంత్రెడ్డి నిలదీశారు. “కేసీఆర్ సీనియర్ నేత. ఆయన సభకు వస్తే తన అనుభవాలను, సూచనలను ప్రభుత్వానికి ఇస్తారని భావించాం. కృష్ణా నదిపై ఒకరోజు, గోదావరిపై మరోరోజు చర్చించాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ ఆయన ముఖం చాటేస్తున్నారు” అని విమర్శించారు. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవమానాలు ఎదురైనా భరించి, సభకు వచ్చి విలువైన సలహాలు ఇచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
తోలు తీస్తామన్న వారు ఎక్కడ?
“సభలో ప్రాజెక్టులపై నిలదీస్తాం.. తోలు తీస్తాం.. బట్టలు ఊడదీస్తాం అని బయట మాట్లాడిన నేతలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?” అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని, తెలంగాణ ప్రయోజనాల కోసం తన దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
