జీహెచ్ఎంసి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా నూతనంగా ఏర్పాటైన తార్నాక డివిజన్ హద్దులను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసి ఏసీపీ పావని గారు పాల్గొన్నారు. తార్నాక డివిజన్ పరిధిలోకి వచ్చిన పలు కాలనీలు, బస్తీలను ప్రత్యక్షంగా సందర్శించి, డివిజన్ సరిహద్దులు, ప్రజలకు అందనున్న పౌరసేవలు, మౌలిక వసతుల అవసరాలపై అధికారులతో చర్చించారు. నూతన డివిజన్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు పాలనా సౌలభ్యం, వేగవంతమైన సమస్యల పరిష్కారం, మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంబంధిత శాఖల సమన్వయంతో తార్నాక డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
