- జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలన
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
ఏప్రిల్ నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ను ప్రారంభానికి సిద్ధం చేయాలనీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దక్షిణ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ సమగ్ర అభివృద్ధి కారిడార్ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మంగళవారం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ కారిడార్ను ట్రాఫిక్ అడ్డంకులు లేని కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,530 మీటర్ల పొడవు గల ప్రధాన ఫ్లైఓవర్ను రూ.620 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, నిర్మాణం) విధానంలో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు కమిషనర్కు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కమిషనర్, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఏప్రిల్ నాటికి కారిడార్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ముఖ్యంగా సైదాబాద్ నుంచి ధోబీఘాట్ జంక్షన్ వరకు కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. కారిడార్ ప్రారంభానంతరం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. క్షేత్ర పరిశీలనలో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ బి. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

