– తెలంగాణను దోచుకున్నందుకా ఆ గుర్తింపు
– త్యాగాల పునాదుల రాష్ట్రంలో లక్షల కోట్లు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబం
– మూడు చింతలపల్లి దత్తత తీసుకుని…మూడు ఇండ్లు కూడా కట్టలే
– రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన 1,100మంది తెలంగాణ జాతిపితలు కారా..!
– శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి మహనీయుల త్యాగాలు లెక్కలేవా..?
– సబ్బండ వర్గాల ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ
– తెలంగాణ పిల్లల ఆత్మ బలిదానాలు చూడలేక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ
– మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన 1,100 మందికి పైగా యువత త్యాగాలను విస్మరించి, రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్ను “తెలంగాణ జాతిపిత”గా ఎలా పిలుస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా పాల్గొన్న మంత్రి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మబలిదానం చేసుకున్న నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి,
సర్వీస్ తుపాకితో కాల్చుకుని ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య వంటి మహనీయుల త్యాగాలకు లెక్కలేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఆ 1,100 మందే అసలైన తెలంగాణ జాతిపితలని స్పష్టం చేశారు.
కులాలకు, మతాలకు అతీతంగా సబ్బండ వర్గాల ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలు చూడలేకనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు.
మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్నామని చెప్పిన వారు మూడు ఇండ్లు కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.
“మా నాయన జాతిపిత” అని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, తెలంగాణను దోచుకోవడంలోనా జాతిపితత్వం ఉందా..? అని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంతోనే మూడుచింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
“నేను కేవలం ఓటు కోసం వచ్చే నాయకుడిని కాదు… మీ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను.
స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాను” అని మంత్రి హామీ ఇచ్చారు.
నల్లగొండ ప్రజలను ఎలా చూసుకున్నానో,
మేడ్చల్ పరిధిలోని మూడు మున్సిపాలిటీల ప్రజలను కూడా అలాగే చూసుకుంటానని భరోసా ఇచ్చారు.ఏ ఆపదలో అయినా ప్రజలకు తోడుగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా తానే చూసుకుంటానని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
