నిర్మాణ రంగంలో నాణ్యత, ముందస్తు నిర్వహణ ఉంటేనే కట్టడాలు దీర్ఘకాలం మనుగడలో ఉంటాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్లో జరిగిన అఖిల భారత సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … భారీ వ్యయంతో నిర్మిస్తున్న వంతెనలు, కాలువలు, ప్రాజెక్టులు నిర్ణీత కాలం కంటే ముందే దెబ్బతినడం ఆందోళనకరమన్నారు. ఒక నిర్మాణం దెబ్బతిన్నప్పుడు దాని పునరుద్ధరణకు భారీగా ప్రజాధనం ఖర్చవుతోందని, దీనివల్ల కొత్త ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం. కుమార్, రిహాబ్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఇంజనీర్ పి. సూర్య ప్రకాష్, సి.ఎస్.ఐ.ఆర్ మాజీ సంచాలకులు ప్రొఫెసర్ కె. గణేశ్ బాబు, రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారి బి. మోహన్ నాయక్, ప్రొఫెసర్ వి. బాలకిస్త రెడ్డి, ప్రొఫెసర్ రమణ నాయిక్ బనోతు పాల్గొన్నారు.
