ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేపడుతోన్న సిట్ అధికారులు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందోననే విషయం మాత్రం చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ కేసును ధారావాహిక సీరియల్ మాదిరి నడిపిస్తున్నారని విమర్శించారు. అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని ఈ నెల ఒకటో తేదిన సిట్ విచారణలో కేసీఆర్ చెప్పారన్నారు. వాస్తవానికి సిట్ విచారణకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదన్నారు. చట్టం అంటే కేసీఆర్కు గౌరవం ఉంది కాబట్టే విచారణకు హాజరు అయ్యారన్నారు. హరీశ్రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్నిఇంతటితో ముగించాలన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ను విచారణను నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని చెప్పారు. దీంతో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి గుర్తొచ్చిందని చెప్పారు. మమ్మల్ని తట్టి లేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నందినగర్ లో కేసీఆర్ విచారణ నేపధ్యంలో మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారనీ.. దాంతో పాటు పోలీసులు శాంతిభద్రతలపైనా దృష్టి పెడితే బావుంటుందన్నారు. సుల్తాన్ బజార్లో పట్టపగలే ఏటీఎం దగ్గర చోరి జరిగిందని విమర్శించారు. నల్లమల సాగర్తో తెలంగాణకు నీళ్ల దోపిడి జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి ఢిల్లీ వెళ్లారని మండిపడ్డారు. ఢిల్లీకి తాకిన సింగరేణి కుంభకోణం గురించి వాస్తవాలను బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఖమ్మంలో రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు. అతనిపై కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్ను అందుకే బదిలీ చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుందన్నారు. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలన్నారు. బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డేనన్నారు.
పోలీసులకు అత్యుత్సాహం మంచిది కాదు..
ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ చీఫ్ సజ్జనార్ జడ్జి కాదని ఆయన కేవలం పోలీసు అధికారి మాత్రమేనని కేటీఆర్ మండిపడ్డారు. సజ్జనార్ అయినా ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ట్వీట్, లీక్లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని హెచ్చరించారు.
