– మేడ్చల్లో కాంగ్రెస్ ప్రచార హోరు
– మూడు మున్సిపాలిటీలకు వంద కోట్ల నిధుల హామీ
– రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
గోల్కొండ టైమ్స్, మేడ్చల్ బ్యూరో
మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో మూడు చింతలపల్లి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
పేదల కోసం సన్న బియ్యం ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు అందించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎందుకు ఆలోచించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేగా మల్లారెడ్డి దోచుకున్న సంపదను ప్రజలకు ఎన్నికల ద్వారానే తిరిగి అందిస్తామని వ్యాఖ్యానించారు.
మూడు మున్సిపాలిటీలకు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. ఎన్నికల అనంతరం మంత్రిగా వచ్చి స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభల్లో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ మేయర్ తోటకూర అజయ్, కొలన్ హన్మంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

