బీఆర్ఎస్ పార్టీని తీవ్ర పదజాలంతో విమర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఆ పార్టీని “భూ రాక్షసుల సమితి”గా అభివర్ణించారు. పదేళ్ల పాలనలో కరీంనగర్తో పాటు చుట్టుపక్కల కనిపించిన భూములన్నింటినీ కబ్జా చేసి ప్రజలను అరిగోస పెట్టారని మండిపడ్డారు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే… ప్రజల ఇండ్లను కూడా కబ్జా చేసి, పుస్తెల తాళ్లు కూడా దోచుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ చౌరస్తా, పాత లేబర్ అడ్డా సమీపంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు 9, 39, 40, 62, 63, 64 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ, పెద్దపల్లి శ్రీలేఖ, దేశ శిల్పా వేదం, గాదె శ్రీలేఖ హాజరయ్యారు. ఈ ఆరు డివిజన్ల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రూ.1500 కోట్ల అభివృద్ధికి సవాల్
కరీంనగర్ అభివృద్ధి కోసం తాను రూ.1500 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఏ పనులు చేశానో, ఎన్ని నిధులు తెచ్చానో అన్న వివరాలతో బుక్లెట్ను ముద్రించి ఇంటింటికీ పంపిస్తున్నానని తెలిపారు. ఆ బుక్లెట్లోని వివరాలు తప్పైతే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిజంగా అభివృద్ధి చేశాయని చెబుతున్నాయంటే, వారు ఖర్చు చేసిన నిధుల వివరాలను ఎందుకు ప్రజల్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. కోతిరాంపూర్ చౌరస్తాలో కనిపించే లైట్లు, అంబేద్కర్ స్టేడియం నుంచి గణేష్ నగర్ వరకు రోడ్డుల అభివృద్ధి, అల్కాపురి కాలనీ రూపాంతరం, పెద్దపోచమ్మ ఆలయ రోడ్డు వంటి పనులన్నీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే సాధ్యమయ్యాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఒకప్పుడు ముంపు ప్రాంతాలుగా ఉన్న కాలనీలు నేడు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని తెలిపారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ దుస్థితికి మొదటి దోషి బీఆర్ఎస్సేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కరీంనగర్కు తీసుకొచ్చి రూ.50 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు, చెత్త బయోమైనింగ్ కోసం మరో రూ.18 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం చూపక జాప్యం చేస్తోందని విమర్శించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, “నన్ను కోసినా డబ్బులు రావు” అని సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
“వాళ్లకు పైసలు కావాలి… మాకు ప్రగతి కావాలి. వాళ్లకు మీ భూములు కావాలి… మాకు మీ బాగోగులు కావాలి” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలపై భూ కబ్జాలకు సంబంధించి 2,600కుపైగా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. అలాంటి పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలే నష్టపోతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ వైఫల్యాల మధ్య జరుగుతున్న పోరాటమని బండి సంజయ్ అభివర్ణించారు. బీజేపీని గెలిపించి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే కరీంనగర్కు మరిన్ని నిధులు తీసుకొచ్చి నగర రూపురేఖలను మార్చుతానని భరోసా ఇచ్చారు.
