- మరో వ్యాపార రంగంలోకి మహిళా స్వయం సహాయక సంఘాలు
– పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి సీతక్క
గోల్కొండ టైమ్స్, వరంగల్
“మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి” అనే నినాదంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కోటి మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. శుక్రవారం జనగాం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పాలకుర్తి పట్టణంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ను ప్రారంభించి, డీఅర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తప్పనిసరిగా ఎస్ హెచ్ జీ సభ్యత్వం తీసుకుని వివిధ వ్యాపారాల్లో భాగస్వామ్యమై ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్ హెచ్ జీ సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టించే బాధ్యతలు అప్పగించి ఉపాధి కల్పించామని, ధాన్యం కొనుగోలు బాధ్యతను కూడా ఎస్ హెచ్ జీ సభ్యులకు అప్పగించామని తెలిపారు. మహిళలు ఎప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా నిలబడేలా ప్రభుత్వం రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకంలో ప్రతి నిరుపేద మహిళకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మహిళల పేర మీదే ఇళ్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
మేడారం జాతరలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారాల్లో ఎదిగేందుకు అవకాశాలు కల్పించామని, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మొబైల్ వ్యాన్లు, ఫంక్షన్ హాళ్ల అప్పగింతల ద్వారా మహిళలను ప్రతి వ్యాపార రంగంలో భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. ఎస్ హెచ్ జీ సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల బీమా సొమ్ము, లోన్ భీమా కింద రూ.2 లక్షలు అందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలతో నాణ్యమైన చీరలు తయారు చేయించి గ్రామీణ, పట్టణ మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశామని చెప్పారు. ఆడపిల్లలను భయపడకుండా చదివించి ఉన్నత కెరీర్లో నిలబెట్టే బాధ్యత తల్లిదండ్రులదేనని, ఈ విషయంపై ఎస్ హెచ్ జీ సభ్యులు గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. “ఒక ఇంటి మహిళ బాగుంటే కుటుంబం బాగుపడుతుంది” అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జనగాం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. జనగాం బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్ శిల్పాలు, బస్టాండ్ చౌరస్తా జంక్షన్ వద్ద సూర్య నమస్కారాల శిల్పాలను ఆవిష్కరించారు. బతుకమ్మ కుంటలో చేపట్టిన అభివృద్ధి పనులు, మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తయిన ఆర్ అండ్ బి బంగ్లా, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీఓ గోపీ రాం, జడ్పీ సీఈఓ మాధురి షా పాల్గొన్నారు.
