– కేంద్ర ఆదేశాలతో ఏఐ ఆధారిత ‘సభా సార్’ అమలు
– గ్రామ సభల డిజిటలైజేషన్కు ‘సభా సార్’ ప్లాట్ఫామ్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (MoPR) గ్రామ సభల డాక్యుమెంటేషన్ను డిజిటల్గా మార్చేందుకు ‘సభా సార్’ (SabhaSaar) అనే ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్ఫామ్ 2025 ఆగస్టు 14న ప్రారంభమై, ఆడియో/వీడియో రికార్డింగ్ల నుంచి బహుభాషల్లో ఆటోమేటిక్గా సమావేశ మినిట్స్ను రూపొందించే సౌకర్యం కలిగి ఉంది. దీనివల్ల శ్రమ తగ్గి, పారదర్శకత, సామర్థ్యం పెరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా 2026 జనవరి 26న నిర్వహించనున్న ప్రత్యేక గ్రామ సభల్లో ఈ ‘సభా సార్’ ([https://sabhasaar.panchayat.gov.in](https://sabhasaar.panchayat.gov.in)) ప్లాట్ఫామ్ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ‘సభా సార్’ వినియోగంపై ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ డైరెక్టర్ శృతి ఓఝా ఉత్తర్వులు జారీ చేశారు. సభాసార్ వల్ల పరిపాలనా భారం తగ్గి, గ్రామ సభల చర్చల సమగ్ర రికార్డులు డిజిటల్గా మారి, సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
