– టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
– హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారం కోరిన సీఎం
– తెలంగాణలో మానుఫాక్చరింగ్ యూనిట్లు,
హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటుపై టాటా ఆసక్తి
– దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం
– లోరియల్ నుంచి రష్మి గ్రూప్ వరకూ… ఎనిమిది సంస్థలతో కీలక ఒప్పందాలు
– జీసీసీలు, స్టీల్ ప్లాంట్, ఏఐ, విమానాల ఎంఆర్వో, క్లీన్ ఎనర్జీకి బాట
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో దూసుకెళ్లింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం ఎనిమిది ప్రముఖ గ్లోబల్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రతిపాదనలు సాధించింది. బ్యూటీ–టెక్ జీసీసీ నుంచి స్టీల్ ప్లాంట్, ఏఐ హార్డ్వేర్, విమానాల ఎంఆర్వో, క్లీన్ ఎనర్జీ వరకు విస్తరించిన ఈ ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ
హైదరాబాద్లో ఫ్రాన్స్కు చెందిన లోరియల్ సంస్థ, ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జీసీసీని 2026 నవంబర్లో ప్రారంభించనుంది. గ్లోబల్ ఇన్నోవేషన్, ఏఐ, డేటా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. భవిష్యత్తులో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కూడా లోరియల్ సానుకూలంగా స్పందించింది.
బ్లైజ్తో ఏఐ, సెమీకండక్టర్ రంగాలకు బలం
కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న బ్లైజ్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ కేంద్రాన్ని విస్తరించనుంది. తక్కువ శక్తి వినియోగంతో పనిచేసే ఏఐ హార్డ్వేర్, ఫుల్–స్టాక్ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. హెల్త్కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
రూ.6,000 కోట్ల న్యూక్లర్ విద్యుత్ ప్రాజెక్ట్కు ఈఓఐ
స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ, తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్కు ఈఓఐ సమర్పించింది. రూ.6,000 కోట్ల పెట్టుబడితో గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. 2047 నాటికి నెట్–జీరో లక్ష్య సాధనకు ఇది కీలకమని ప్రభుత్వం తెలిపింది.
విమానాల ఎంఆర్వోకు సర్గాడ్ ఎంవోయూ
అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ, తెలంగాణలో విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. వరంగల్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల్లో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం సూచించింది.
రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్
రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయనుంది. రూ.12,500 కోట్ల పెట్టుబడితో కుదిరిన ఈ ఎంవోయూ ద్వారా 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి. లేబర్–ఇంటెన్సివ్ తయారీ విధానంతో ఈ ప్లాంట్ పనిచేయనుంది. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీపై కూడా చర్చలు జరిగాయి.
ఏబీ ఇన్బెవ్ యూనిట్ విస్తరణ
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్బెవ్, తెలంగాణలో ఉన్న తన తయారీ యూనిట్లను విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. విస్తరణతో ఆదాయం, ఉపాధి మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సిస్కోతో స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందాలు
సిస్కో సంస్థతో టాస్క్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా యువతకు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ అందుతోంది. ఈ కార్యక్రమాలను సిస్కో ప్రతినిధులు ప్రశంసించారు.
టాటా గ్రూప్తో అభివృద్ధి భాగస్వామ్యం
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై, తెలంగాణ రైజింగ్–2047 విజన్ను వివరించారు. క్రీడా మౌలిక వసతులు, స్కిల్ డెవలప్మెంట్, మూసీ నది పునరుజ్జీవనం, హోటళ్లు, రిసార్టులు, ఏఐ డేటా సెంటర్లపై భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిగాయి.


