– హైదరాబాద్లో డబ్ల్యూఈఎఫ్ ఫాలోఅప్ సదస్సు ప్రతిపాదనకు సానుకూల స్పందన
– ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం
– రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడుల పెట్టుబడులతో 4 వేల మందికి ఉపాధి
– రూ.623 కోట్ల పెట్టుబడితో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) మద్దతు ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దావోస్ సదస్సులో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాల అమలును సమీక్షించేందుకు ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను ప్రపంచానికి చాటేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.
సీఎం ప్రతిపాదనకు డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, సమీప భవిష్యత్తులో తుది నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ‘సమ్మర్ దావోస్’, సౌదీ అరేబియా కూడా ఫాలోఅప్ ఫోరం నిర్వహణకు ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్లోని విభిన్న రంగాలు పరస్పర సహకారానికి అనుకూలంగా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. ఈ విజన్లో భాగస్వాములమై తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. అలాగే బయోఏషియా–2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ తెలంగాణ పురోగతిపై చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో డబ్ల్యూఈఎఫ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ ఇదేనని గుర్తుచేశారు. సీ4ఐఆర్ ఆదర్శవంతమైన మోడల్గా నిలిచిందని, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఉత్తమ పద్ధతులపై జరుగుతున్న పరిశోధనలను తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని డబ్ల్యూఈఎఫ్ హామీ ఇచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్ల అభివృద్ధి వ్యూహం, భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వివరించారు. ఇది నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్కు ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో ఉన్న అనుకూలతలను వివరించారు.
ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
తెలంగాణను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా, ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. నెట్-జీరో సిటీ అభివృద్ధి తెలంగాణ విజన్లో భాగమని పేర్కొన్నారు.
రూ.623 కోట్ల పెట్టుబడితో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
తెలంగాణలో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ప్రముఖ సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా శంషాబాద్, గాగిల్లాపూర్లోని తన యూనిట్లను రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్నైడర్ ఎలక్ట్రిక్ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు. విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.
యూనిట్ల విస్తరణతో ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్లు వంటి ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెరగనుంది. తెలంగాణలో స్నైడర్ ఎలక్ట్రిక్కు ఇప్పటికే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబును సీఎం అభినందించారు. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని సీఎం పేర్కొన్నారు.

