– ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేయాలి
– ఫోన్ ట్యాపింగ్ విచారణ బీసీ రిజర్వేషన్ల నుంచి ప్రజలను మళ్లించేందుకే
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శ
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ముచ్చర్ల సత్యనారాయణ బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు అని కొనియాడారు. ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇలాంటి ఉద్యమ నేతల చరిత్రను కొత్తతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ముచ్చర్ల సత్యనారాయణ లాంటి ఎంతో మంది ఉద్యమకారులు విస్మరణకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ తేజోమూర్తుల జయంతులు, వర్ధంతులు ప్రభుత్వపరంగా జరగకపోవడం బాధాకరమన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత, ఇది గుంపుమేస్త్రీ–గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రజల దృష్టికి రాకుండా డైవర్షన్ కోసం ఈ వ్యవహారం తెరపైకి తెచ్చారన్నారు. ఈ విచారణ ద్వారా తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు.
బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. గ్రామపంచాయితీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బీసీలను మోసం చేస్తున్నాయని ప్రజలు గ్రహించాలని పిలుపునిచ్చారు.
కులగణన అంశంపై మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపించి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన ద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ జాగృతి ముందడుగు వేస్తోందని, బీసీ మేధావులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి బీసీ కులం, ఉపకులానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సేకరించి నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు.
తెలంగాణ జాగృతి అధికారంలోకి వచ్చిన రోజు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అమరజ్యోతిని తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలను రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక శిక్షణ వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించకపోయినా, ప్రజలకు న్యాయం చేసే వారందరికీ మద్దతుగా నిలుస్తామని కవిత స్పష్టం చేశారు.

