తెలంగాణ భవన్లో హరీశ్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్
నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఒక్కొక్కటిగా బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ పార్టీని “తెలంగాణకు నెంబర్వన్ విలన్”గా ఆయన అభివర్ణించారు.
ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సూచించినా, అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రాలో కలిపి చారిత్రక ద్రోహం చేసిందని ఆరోపించారు. పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. విభజన సమయంలోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11వ షెడ్యూల్లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేర్చకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు.
కృష్ణా నదీ జలాల విషయంలో రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని, ఉత్తమ్కుమార్రెడ్డి కట్టుకథలు, సీఎం పిట్టకథలు చెప్పారని హరీశ్రావు ఆరోపించారు.
కాళేశ్వరం–పాలమూరుపై కక్ష
రూ.200 కోట్లు ఖర్చు చేస్తే 5 లక్షల ఎకరాలకు నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తోందని హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండు పిల్లర్లు కుంగిన అంశాన్ని తీసుకుని మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని అన్నారు.
రూ.100 నుంచి 200 కోట్లు ఖర్చు చేస్తేనే 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ, రెండేళ్లలో కాళేశ్వరంపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రైతాంగం మీద, ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పగబట్టిందని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజ్ లేకున్నా నదీప్రవాహం ద్వారా కన్నెపల్లి పంప్హౌస్ నడిపి నీళ్లు తెచ్చే సాంకేతిక అవకాశాలున్నాయని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించామని, కానీ ప్యాకేజ్–3 బుడ్డ కాల్వ పనులు పూర్తిచేయకుండా ఈ ఏడాది 50 టీఎంసీల నీటిని నిలుపుకునే అవకాశాన్ని కాంగ్రెస్ కాలరాసిందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో చరిత్రాత్మక ప్రగతి
1956 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు వచ్చిన ఆయకట్టు కేవలం 36 లక్షల ఎకరాలేనని హరీశ్రావు వివరించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్త ఆయకట్టు కేవలం 5.71 లక్షల ఎకరాలేనని, స్టెబులైజేషన్ 93 వేల ఎకరాలకే పరిమితమైందన్నారు.
అదే బీఆర్ఎస్ పాలనలో, కేవలం తొమ్మిదిన్నరేళ్లలో – అందులో రెండేళ్లు కరోనా, పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక సంక్షోభాలున్నా – 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామని చెప్పారు. ఇందులో 17.24 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టేనన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏడాదికి సగటున 57 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే వస్తే, బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి లక్షా 81 వేల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు వచ్చిందని గణాంకాలతో వివరించారు

