రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక స్ట్రీట్ రౌడీనా ?అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను సైతం బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ , అనంతరం మాజీ మంత్రి హారీశ్ రావు గన్పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. స్పీకర్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
బీఏసీ మీటింగ్కు ప్రభుత్వం తరపున గంటన్నర లేటుగా వచ్చారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వరా అని ప్రశ్నించారు. పార్లమెంటులో మోదీని రాహుల్ గాంధీ తిట్టడంలేదా అని నిలదీశారు. అసెంబ్లీలో తాను సీఎం గురించి మాట్లాడితే తప్పు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీని గాంధీ భవన్లాగా, సీఎల్పీ మీటింగ్లాగా మార్చారంటూ వ్యాఖ్యలు చేశారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువంటూ విరుచుకుపడ్డారు.
