
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కోరికను నెరవేర్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయాక ఫార్మ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో బయటకు వచ్చారు. కేసీఆర్ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు సైతం అసెంబ్లీకి రావాలంటూ పిలిచారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా…. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలి సారి అసెంబ్లీలో కనిపించారు. బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో సంతకం చేసిన కేసీఆర్, సంతాప తీర్మానం తరువాత సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జీరో అవర్ లో మాట్లాడేందుకు అవకాశం ఉన్నప్పటికీ, వెళ్లిపోయారు. ఇక అసెంబ్లీలో కేసీఆర్ కూర్చున్న చోటకే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కరచాలనం చేసి, పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగిన రేవంత్ రెడ్డికి, బాగానే ఉందంటూ తల ఊపుతూ కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గౌరవ సూచనగా లేచి నిలబడ్డారు. అయితే కేటీఆర్, ఆయన పక్కన కూర్చున్న పాడి కౌశిక్ రెడ్డి లేవలేదు.. ఈ విషయాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సోషల్ మీడియాలు తమ నాయకుడు గొప్పంటే… తమ నాయకుడి గొప్పంటూ పోటీ పడుతున్నారు.. కేసీఆర్ వద్దకే ఎవరైనా రావలంటూ ఓ వర్గం ప్రచారం చేస్తుంటే.. అది రేవంత్ రెడ్డి సంస్కారం అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇక కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని , తమ నేతను చూసి నేర్చుకోవలంటూ రేవంత్ అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇక జనవరి రెండో తేదీ నుంచి అసెంబ్లీ తిరిగి ప్రారంభమవుతుండగా.. కేసీఆర్ చర్చలో పాల్గొంటారా లేదోనని మరో చేర్చ మొదలయింది.
కేసీఆర్ ఎందుకు వెళ్లారో తెలియదు: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్, తాను మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం ఐదు నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మీడియాతో చిట్చాట్ అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్కు చేరుకున్నసీఎం.. మంత్రులు, ప్రభుత్వ విప్లతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో తమ స్ట్రాటజీపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. మరికాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ పనిదినాలను బీఏసీ ఖరారు చేయనుంది.
అసెంబ్లీ సెషన్ షెడ్యూల్ విడుదల
|
శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే, మండలి సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం పలు ఆర్డినెన్స్లను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ జీరో అవర్ను కొనసాగించగా పలువురు సభ్యలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. బీఏసీలో శాసనసభ సమావేశాలు జనవరి 2 నుంచి 7 వరకు జరపాలని నిర్ణయించారు.
రెండు గంటలు సాగిన శాసనసభ : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజున దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డిదామోదర్రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ జీరో అవర్ నిర్వహించారు. శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటించారు. అనంతరం బీఎస్టీ సవరణల ఆర్డినెన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మొదటి, రెండో సవరణల ఆర్డినెన్స్లు, పురపాలక సంఘాల సవరణల ఆర్డినెన్స్, తెలంగాణ సమగ్ర శిక్షా ఆడిట్ నివేదిక, పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్లను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉభయ సభల్లో ప్రవేశ పెట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణల ఆర్డినెన్స్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉభయ సభల్లో ప్రవేశ పెట్టారు. తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణల ఆర్డినెన్స్ పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క ఉభయసభల్లో ప్రవేశ పెట్టారు. ఆయా ఆర్డినెన్స్ల ద్వారా తెచ్చిన సవరణలకు చట్టబద్దత కల్పించేందుకు ప్రస్తుత సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ జీరో అవర్ నిర్వహించారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐలకు చెందిన సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటలు శాసనసభ సాగింది.
బీఏసీ సమావేశం : శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఏసీ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. మహేశ్వర్రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ పనిదినాలు ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు.
15 రోజులు సమావేశాలు జరపాలని పట్టుపట్టాం : బీఆర్ఎస్ నేత హరీశ్రావు
బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టుపట్టామని వివరించారు. వారం రోజులు జరిపి మళ్లీ బీఏసీ పెడతామన్న స్పీకర్ చెప్పారన్న హరీశ్రావు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారని ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించామని భట్టి విక్రమార్క అన్నారని హరీశ్ గుర్తుచేశారు. ఇప్పుడు మీరు(కాంగ్రెస్ ప్రభుత్వం) ఇవ్వకపోతే మేము బాయ్కాట్ చేయాలా అని అడిగామన్నారు.
32 అంశాలపై చర్చించాలని కోరాం : బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
శాసనసభ సమావేశాలు కనీసం 20 రోజులైనా నిర్వహించాలని కోరామన్నారు. 32 అంశాలపై చర్చించాలని కోరినట్లుగా వివరించారు. జనవరి 2 నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. జనవరి 7న మళ్లీ బీఏసీ సమావేశం ఉంటుందని తెలిపారు. రెండు రోజులు సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవటం సరికాదని వివరించారు.
