తెలంగాణ విద్యా సంస్కరణలపై విస్తృత చర్చ
– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై హిమాచల్ మంత్రికి వివరణ
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్ మంత్రికి వివరించారు.
మినీ యూనివర్సిటీ తరహాలో రెసిడెన్షియల్ స్కూల్స్
25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని త్వరలో తీసుకువస్తామని, ఇందుకు సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా నియమించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఐటీఐలకు కొత్త రూపం
రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలుగా (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు) తీర్చిదిద్దుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ క్రమంలో మల్లెపల్లి ఐటీఐని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ మంత్రికి సూచించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్పై ఆసక్తి
తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను తమకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ముఖ్యమంత్రి విజన్ను హిమాచల్ ప్రదేశ్ మంత్రి అభినందించారు.

