– పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా
– మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్
– తండ్రులను కోల్పోయిన ఇద్దరు బిడ్డలకు ఇంజనీరింగ్ ఫీజుల చెల్లింపు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. పేదరికం చదువుకు అడ్డుకాకూడదన్న సంకల్పంతో వారి బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి కోర్సుకు సంబంధించిన ఫీజులను కేసీఆర్ స్వయంగా చెల్లించారు.
విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు నవీన్, అదే గ్రామానికి చెందిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కుమారుడు అజయ్—ఇద్దరూ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరి పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్, వారి ఇంజనీరింగ్ విద్య పూర్తి కాలానికి అవసరమైన ఫీజులను భరిస్తూ విడివిడిగా చెక్కులు అందజేశారు.కేవలం ఫీజులకే పరిమితం కాకుండా, చదువుకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా అదనపు ఆర్థిక సాయం అందించి విద్యార్థులకు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,
“కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. ఫీజుల కోసం భయపడొద్దు. మీరు గొప్ప స్థాయికి చేరాలి. ఏ సమస్య వచ్చినా నేనున్నా”
అంటూ విద్యార్థులను ఆశీర్వదించారు.
విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందాల్సిన ఆర్థిక, ఇతర సహాయాలు సకాలంలో అందేలా పర్యవేక్షించాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, పిల్లల చదువు–భవిష్యత్తు గురించి ఆలోచించిన కేసీఆర్కు విద్యార్థుల తల్లులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. తమ చదువుకు భరోసాగా నిలిచిన కేసీఆర్ గారికి ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
