హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఈ ఎన్నికలు గనుక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే గులాబీ దళం అసలు సత్తా ఏంటో తెలిసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల గర్వంతో వ్యవహరిస్తోందని.. వారి రెండేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల కోసం పోరాడుతామని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతామని చెప్పారు.తెలంగాణలో మరోసారి గులాబీ జెండాలు రెపరెపలాడాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షత వహించారు. పార్టీ శ్రేణుల భారీ కేకలు, జై తెలంగాణ నినాదాల మధ్య ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇక్కడ కార్యకర్తలు గులాబీ జెండాల పట్టుకొని జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో.. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి కొన్ని చోట్ల గెలిచినట్లు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఎటువైపు ఉందో ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు కనుక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే.. భారత రాష్ట్ర సమితి సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేది. గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారు’ అని ఆయన స్పష్టం చేశారు.
