– భారత్–అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం
– ‘ఫాదర్ ఆఫ్ డీల్స్’గా అభివర్ణిస్తున్న అగ్రరాజ్యం
– భారత వ్యవసాయం, పాడి రంగ మార్కెట్లోకి అమెరికా అడుగులు
– భారతీయ ఎగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గింపు
– అమెరికా లేదా వెనుజులా నుంచి క్రూడాయిల్ దిగుమతులకు ఒప్పందం
– రష్యా క్రూడాయిల్పై భారత్కు ‘వద్దు’ అన్న అమెరికా
– అలాంటి అధికారిక సమాచారం మాకేమీ రాలేదు: రష్యా
– అగ్రరాజ్యం ప్రకటనపై మౌనంగా ఉన్న భారత ప్రభుత్వం
– ట్రేడ్ డీల్ ప్రకటనతో భారత మార్కెట్లలో జోష్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
భారత్–అమెరికా మధ్య కుదిరిందని ప్రకటించిన వాణిజ్య ఒప్పందం దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, ఇంధన రంగం వరకూ విస్తరించిన ఈ డీల్ను అమెరికా ‘ఫాదర్ ఆఫ్ డీల్స్’గా పేర్కొంటుంది. అమెరికా నిబంధనలకు తలొగ్గిన భారత్ భవిష్యత్ లో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి నిలేపేస్తుందని అమెరికా ప్రకటించింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అధికారిక స్పందన ఇవ్వలేదు. భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య (ట్రేడ్) ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో కీలక మలుపుగా మారింది. భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించడం, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 2న అర్థ రాత్రి సమయంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ ట్రేడ్ డీల్ ప్రకారం, అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారత ఉత్పత్తులపై ఉన్న అధిక సుంకాలను గణనీయంగా తగ్గించనుంది. ముఖ్యంగా బట్టలు, ఔషధాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, సాంకేతిక సేవల ఎగుమతులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. గతంలో విధించిన అడిషనల్ రెసిప్రోకాల్ టారిఫ్ కూడా ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో, అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు కొన్ని రంగాల్లో సుంకాల సవరణపై చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో 25 శాతం ఉన్న టారిఫ్ లను 50 శాతం పెంచడంతో పాటు అవసరమైతే 100 శాతం రెసిప్రోకాల్ టారిఫ్ లు వేస్తామని ట్రంప్ బెదిరిస్తూ వచ్చారు. ముఖ్యంగా రష్యా- ఇండియా క్రూడాయిల్ దిగుమతులను సున్నాకు చేర్చాలని అమెరికా పట్టు. దాంతో పాటు భారతీయ వ్యవసాయ, విత్తన పాడి పరిశ్రమల్లోకి అమెరికా కంపెనీలను ఫ్రీ ట్రేడ్ డీల్ తో అనుమతించాలన్నది ట్రంప్ డిమాండ్. అయితే ట్రేడ్ డీల్ జరిగిందన్న విషయాన్ని ట్రంప్ తన ఎక్స్ (ట్విట్టర్ ) ఖాతా ద్వారా ప్రకటించారు. ట్రంప్ హయాంలో సంబంధాలు “ఘర్షణ పూరితంగా” మొదలైనప్పటికీ, ఇప్పుడు అవి ఒక “వ్యూహాత్మక భాగస్వామ్యం”గా మారాయి. పూర్తిస్థాయి ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ (FTA) ఇంకా సంతకం కాలేదు కానీ, చిన్న చిన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయాయి. అయితే దీనిపై భారత్ నుంచి ఇంకా పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం ఇతర దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలపైనా పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూరోపియన్ యూనియన్, ఆసియన్ దేశాలతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలకు ఇది కొత్త దిశ చూపించవచ్చని చెబుతున్నారు. అలాగే బహుళ ధ్రువ ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా ఎదుగుతోందనే సంకేతంగా ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు. భారత్–అమెరికా మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు ఉత్సాహం నింపడమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ స్థాయిని మరింత పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఒప్పందంలోని అన్ని షరతులపై అధికారిక వివరాలు వెలువడిన తర్వాతే పూర్తి ప్రభావం స్పష్టమవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ప్రధాని మోడీ, అమిత్షా స్పందన:
ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు.
“ఈ ట్రేడ్ డీల్ భారత్కు అనుకూలంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు నిదర్శనం. ఇది మన సహనం, దూరదృష్టికి ప్రతీక. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింత పెరుగుతాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
“18 శాతానికి సుంకాలు తగ్గించడం ద్వారా భారత్–అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుంది. పరస్పర వృద్ధికి ఇది దోహదపడుతుంది. ఈ ఒప్పందానికి మోడీ, ట్రంప్లకు అభినందనలు” అని తెలిపారు.
మార్కెట్లలో ట్రేడ్ డీల్ ప్రభావం:
ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్కసారిగా ఎగబాకగా, పెట్టుబడిదారుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర పెరిగినట్లు అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎగుమతి ఆధారిత రంగాల షేర్లకు గట్టి మద్దతు లభించింది. అమెరికా మార్కెట్లలోనూ భారత ఐటీ సంస్థల షేర్లు పాజిటివ్గా స్పందించాయి. ఈ పరిణామం విదేశీ పెట్టుబడిదారుల్లో భారత్పై నమ్మకాన్ని మరింత పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు.
క్రూడాయిల్ ఎగుమతులపై రష్యా
ఈ ట్రేడ్ డీల్ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తుందన్న వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. “భారత్ నుంచి అలాంటి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు” అని రష్యా స్పష్టం చేసింది. భారత్తో తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు. ఈ అంశంపై భారత్ నుంచి ఇంకా అధికారిక వివరణ రావాల్సి ఉంది.
భారతీయ వ్యవసాయంపై ట్రేడ్ డీల్ ?
భారత్–అమెరికా ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత ప్రవేశం కల్పించే అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా గోధుమలు, మక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తులు (డెయిరీ) రంగంలో అమెరికా పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారులకు ధరల పరంగా లాభం అయినప్పటికీ, చిన్న, మధ్యతరహా రైతులకు పోటీ ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రేడ్ డీల్లో ప్రత్యక్షంగా ఎంఎస్పీ పై ఎలాంటి ప్రకటన లేకపోయినా, అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఓపెనింగ్ పెరిగితే, భవిష్యత్లో సబ్సిడీలు, ధరల మద్దతుపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన రైతు సంఘాల్లో వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంఎస్పీ విషయంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేస్తోంది.
అమెరికా భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో, బియ్యం, మసాలాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్, బాస్మతి రైస్, సీ- ఫుడ్ కు అమెరికా మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని అంచనా. భారత పాడి పరిశ్రమ కోట్లాది చిన్న రైతుల జీవనాధారం. అమెరికా డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ తెరవడం జరిగితే, ధరల యుద్ధం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పాల పొడి, చీజ్ వంటి ఉత్పత్తుల్లో పోటీ పెరుగుతుందని నిపుణుల అంచనా. ఈ కారణంగానే డెయిరీ రంగంపై భారత్ ఇప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ ట్రేడ్ డీల్ భారతీయ వ్యవసాయానికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఎగుమతుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, దిగుమతుల పోటీ వల్ల దేశీయ రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. డీల్ అమలు విధానం, రక్షణ చర్యలు, ప్రభుత్వ మద్దతు మీదే రైతుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
