– హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు వార్నింగ్
– బతుకమ్మకుంట సంక్రాంతి కార్యక్రమాలపై అభ్యంతరం
– కంటెప్ట్ కోర్టు ఇంకా పెండింగ్లో ఉందని పేర్కొన్న కోర్ట్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
న్యాయస్థానంతో ఆటలాడుకోవాలని చూడొద్దని హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి రంగనాథ్ వ్యవహారశైలిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగనాథ్పై కోర్టు ధిక్కరణకు సంబంధించిన చర్యలు ఇంకా పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం, గత విచారణ సందర్భంగా ఆయన క్షమాపణ కోరిన అంశాన్ని కూడా ప్రస్తావించింది.
బతుకమ్మకుంట చెరువు వద్ద నిర్వహించిన సమావేశానికి రంగనాథ్ హాజరై జిమ్ ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో ఈ తరహా ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.
బతుకమ్మకుంట భూ వివాదంపై గతేడాది జూన్ 12న హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని, సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్టుగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
