– జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్
– ప్రజల సమస్యలకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరిక
– ఇంజనీరింగ్ విభాగాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం
– శానిటేషన్ అధికారుల పనితీరు బాగాలేదని అసంతృప్తి
– తీరు మార్చుకోకుంటే చర్యలకు సిద్ధమని హెచ్చరిక
మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాలో.. రేపో విడుదలవుతున్న నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీపైనా దృష్టి సారించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం వచ్చే నెల ముగిస్తుండటంతో, మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత బల్దియా ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. నగరంలో శంకుస్థాపనలు చేసుకున్న ప్రాజెక్టుల పనులు కూడా నత్తనడకన సాగుతుండటం, పనుల్లో కూడా చెప్పుకోదగ్గ మెరిట్ కనబడకపోవడంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యంగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం పనితీరు సరిగా లేదంటూ ఆయన అధికారులకు చీవాట్లు పెట్టారు. ప్రపంచస్థాయి నగరం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకుపోతుంటే.. బల్దియా ఇంజనీరింగ్ అధికారుల పనితీరు ఇంత పేలవంగా ఉందంటూ వాపోయారు. ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత పూర్తిగా అధికారులదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా ఇప్పటికే విభజించింది ప్రభుత్వం. ఇంత పెద్ద మహా నగరంలో అధికారులు పనిచేయకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని హెచ్చరించారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అంశాలపై ప్రజల ప్రశ్నలు మరింత పెరుగుతాయని, వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు మంత్రి. జోనల్ స్థాయిలో అధికారులతో పనిచేయించే బాధ్యత కమిషనర్దేనని స్పష్టం చేశారు మంత్రి. హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ వంటి కీలక ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేసేందుకు టైమ్ బౌండ్ తో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సమయంలో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, మెయింటెనెన్స్ అధికారుల మరింత శ్రద్దగా పనిచేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
హైదరాబాద్ స్వచ్ఛ బ్రాండ్ ఇమేజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైనే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జీహెచ్ఎంసీలో శానిటేషన్ వ్యవస్థపై నిత్యం ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పైనా ప్రభావం చూపుతుందని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

