– డెంగ్యూ సహా కీటకజనిత వ్యాధుల నియంత్రణ చర్యలకు దేశవ్యాప్త గుర్తింపు
– జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
గోల్కొండ టైమ్స్, హైదరాబాద్
దోమలు సహా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణలో హైదరాబాద్ నగరం సాధించిన పురోగతికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. నాగ్పూర్లో నిర్వహించిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్స్ (MSUs) జాతీయ సమీక్షా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలను కేంద్ర అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ 2025 సంవత్సరంలో డెంగ్యూ కేసులను హైదరాబాద్ ఎలా గణనీయంగా తగ్గించిందో వివరిస్తూ” Technology-Driven Vector Borne Disease Surveillance & Management – Dengue control sucess story of Hyderabad” పేరుతో సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెక్టర్ బోర్న్ డిసీజెస్ (VBD) యాప్ ద్వారా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసిన విధానాన్ని ఆయన ప్రస్తావించారు.
జీఐఎస్ ఆధారిత డ్యాష్బోర్డులు, రియల్టైమ్ డేటా అప్డేట్స్తో క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డేటా ఆధారిత విధానం, శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన చర్యలు ఫలప్రదంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు హైదరాబాద్ అనుసరించిన నమూనా ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించింది.



