- పొలిటికల్ పైరవీకి బల్దియా కమిషనర్ చెక్
- బదిలీ చేసినా వెళ్లబోనంటూ కూర్చున్న వైనం
- విధుల నుంచి తొలగిస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం
- ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లపై విజిలెన్స్ విచారణ
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
అవినీతి ఆరోపణలతో పాటు రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయని చెప్పుకొన్న అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. తన పరిధి దాటి వ్యవహరించడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మరో సర్కిల్ కు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అయితే బదిలీ స్థానంలో ఆయన రిపోర్ట్ చేయలేదు. తనను ఎవరూ ఏం చేయలేరని, తాను అల్వాల్ లోనే మళ్లీ పోస్ట్ తెచుకుంటానని సన్నిహితులు, ఉద్యోగ వర్గాలతోను శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. దీంతో పాటు అధికార పార్టీ నేతలతో పైరవీలు కూడా మొదలు పెట్టారు. నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పై ఒత్తిడి పెంచారు. అయితే రెండు రోజుల క్రితమే అల్వాల్ లో పర్యటించిన కమిషనర్ కర్ణన్ , అక్కడి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అల్వాల్ సర్కిల్లో శ్రీనివాస్ రెడ్డి పనిచేసిన సమయంలో ఖాళీ స్థలాలకు పెద్ద ఎత్తున ఇంటి నెంబర్లు మంజూరు చేశారనే ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు విచారణకు ఆదేశించారు. ఒక సీనియర్ సిటిజన్కు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ వ్యవహారంలో తన పరిధిని మించి డీసీ మైనంపల్లికి తొత్తుగా వ్యవహరిస్తూ, అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహరించారని ఫిర్యాదు కూడా అందింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలను ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. మరో కాంగ్రెస్ నేతకు శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో చెప్పుచేతల్లో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
