– దేశవ్యాప్తంగా సంపూర్ణ సేవల నిలిపివేతకు పిలుపు
– గిగ్ వర్కర్ల ఆందోళనలకు కార్మిక సంఘాల మద్దతు
–
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత (గిగ్) రవాణా కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి, అగ్రిగేటర్ కంపెనీల నియంత్రణలేని చార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 7న “ఆల్ ఇండియా బ్రేక్డౌన్” నిర్వహించనున్నట్లు యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్, అంకుల్ (UNCL), మూవర్ తదితర అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమై ఉన్న లక్షలాది డ్రైవర్లు ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు.
మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు ఉల్లంఘన
మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, అగ్రిగేటర్ కంపెనీలు వాటిని పట్టించుకోకుండా యథేచ్ఛగా చార్జీలను నిర్ణయిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నియంత్రణలేని ధరల విధానం కారణంగా డ్రైవర్లు తీవ్రమైన ఆదాయ అస్థిరత, పెరుగుతున్న అప్పులు, నిలకడలేని పని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారని తెలిపారు.
ప్రయాణికులకూ తప్పని ఇబ్బందులు
డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా నియంత్రిత ధరలు లేకపోవడం, అధిక సర్జ్ చార్జీలు, సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్లు పేర్కొన్నాయి. ఈ పరిస్థితి యాప్ ఆధారిత రవాణా రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు కనీస ప్రాథమిక చార్జీలను (మినిమమ్ బేస్ ఫేర్స్) నోటిఫై చేయకపోవడం వల్ల, అగ్రిగేటర్ కంపెనీలు డ్రైవర్ల ఆదాయాన్ని ఏకపక్షంగా తగ్గిస్తూ కమిషన్లను పెంచుతున్నాయని కార్మిక సంఘాలు విమర్శించాయి. ఇంధన ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా మరియు ఇతర ఆపరేషన్ రిస్క్ల భారం పూర్తిగా డ్రైవర్ల మీదే మోపబడుతోందని తెలిపారు.
అప్పుల ఊబిలోకి కార్మికులు
ఇంధన ధరలు పెరుగుతున్నా, వాహనాల మరమ్మతుల ఖర్చులు అధికమైనా, ఆదాయం మాత్రం రోజురోజుకీ తగ్గుతుండటంతో యాప్ ఆధారిత డ్రైవర్లు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని యూనియన్లు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి కొనసాగితే లక్షలాది కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచాయి. ఆటోలు, క్యాబ్స్, బైక్ టాక్సీలతో సహా అన్ని యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ప్రాథమిక చార్జీలను తక్షణమే నోటిఫై చేయాలని, అది కూడా గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్లతో సంప్రదించి కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాలని డిమాండ్ చేశాయి. అలాగే ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలను యాప్ ఆధారిత కమర్షియల్ ప్రయాణాలకు వినియోగించడంపై కఠిన నిషేధం విధించాలని, లేకపోతే మోటారు వాహన చట్టాలకు అనుగుణంగా తప్పనిసరిగా వాటిని కమర్షియల్ వర్గంలోకి మార్చాలని స్పష్టం చేశాయి.
యాప్ ఆధారిత రవాణా రంగంలో న్యాయమైన, చట్టబద్ధమైన, స్థిరమైన నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో మరింత ఆలస్యం జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది యాప్ ఆధారిత రవాణా కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.
సమ్మెకు విస్తృత మద్దతు
ఫిబ్రవరి 7, 2026న జరగనున్న ఆల్ ఇండియా బ్రేక్డౌన్కు దేశవ్యాప్తంగా అనేక యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ గిగ్ & ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సహ-వ్యవస్థాపకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
పలు సంఘాల సంఘీభావం
ఈ సమ్మెకు అత్తినమొని నాగేష్ కుమార్ (BRTU), వెంకటేశం (AITUC), అబ్దుల్ రావూఫ్ (AIPC), అలీ బాఖ్రీ (ILWF), సతీష్ కుమార్ (TRCPTU), ఆర్.కే. రెడ్డి (INTUC), కొండల్ రెడ్డి, బాల్ రెడ్డితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
